కందనవోలు కర్నూలు, నవంబర్ 12:
విజయానికి విద్య కీలకమని, విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు..బుధవారం నగరం లోని ఏ.క్యాంప్ లో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో మాంటిస్సోరి సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం లో గవర్నర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత స్వర్గీయ కళ్యాణమ్మ అంకిత భావంతో విద్యా రంగం అభివృద్ధి కి కృషి చేశారని, పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి వినూత్న బోధనా పద్ధతులను అమలు చేయడంలో మాంటిస్సోరీ విద్యాసంస్థలు కృషి చేశాయని తెలిపారు. పరిశ్రమల శాఖా మంత్రి టిజి భరత్, నంద్యాల ఎంపీ డాక్టర్ బి.శబరి, అనేక మంది రాజకీయ నాయకులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఐఎఎస్, ఐపిఎస్ అధికారి, వైద్యులు, న్యాయవాదులు, పైలట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మాంటిస్సోరి విద్యా సంస్థలలో చదువుకున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు.విద్య ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు… అసమానతలను తగ్గించడంలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు..విద్య సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని, పేదరిక చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు.. బాలికలు, మహిళలు చదువుకున్నప్పుడు వారి కుటుంబాలతో పాటు సమాజం కూడా ప్రయోజనం పొందుతుందన్నారు.. ప్రభుత్వం బాలికల విద్య, లింగ సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల విద్య ను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, దీని వల్ల సమాజానికి మేలు కలుగుతుందని గవర్నర్ పేర్కొన్నారు.విద్య బలమైన, ఆరోగ్యకరమైన సృజనాత్మక మరియు అభివృద్ధి చెందిన సమాజాన్ని సృష్టించడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనం అన్నారు. క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణ ద్వారా జీవితంలో విజయం సాధించబడుతుందన్నారు. పాఠశాలలు ఈ లక్షణాలను విద్యార్థులకు చిన్నప్పటి నుండే నేర్పించాలని, విద్యార్థులు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం లాంటివి నేర్పించాలన్నారు. ఈ నైపుణ్యాలు నేటి వృత్తిపరమైన ప్రపంచంలో చాలా ముఖ్యమైనవి అని గవర్నర్ పేర్కొన్నారు.కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో 50 సంవత్సరాల క్రితమే కీర్తిశేషులు కల్యాణమ్మ మాంటిస్సోరీ పాఠశాలకు పునాది వేశారన్నారు.. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మాంటిస్సోరీ విద్యా సంస్థలు అనేక బ్రాంచ్ లు ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకు చదువును నేర్పిస్తున్నారని తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాంటిస్సొరి విద్యాసంస్థలు విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు..కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
